ఢిల్లీ, సామాజిక స్పందన:
భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే నేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం తలపడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్‌ హౌస్‌కు చేర్చారు.
ద్రౌపది ముర్ముకు తగినంత మెజారిటీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్‌ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజారిటీతో గెలుస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.


@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@


ఏపీ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం



హైదరాబాద్‌, సామాజిక స్పందన:

ఏపీ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు జడ్జిలుగా కొలీజియం పదోన్నతి కల్పించింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌, బండారు శ్యామ్‌సుందర్‌, ఊటుకూరు శ్రీనివాస్‌, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు.