అమరావతి, సామాజిక స్పందన

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండో రోజూ శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు..

'చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి', 'సైకో పాలన నశించాలి' అంటూ నినదించారు. 

స్పీకర్‌ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసనపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని బుగ్గన అన్నారు. అంబటి మాట్లాడుతూ సీఎం జగన్‌, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో తెదేపా ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు..

ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

సభలో తెదేపా నిరసన నేపథ్యంలో ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లను ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ చేసినట్లు ఆయన ప్రకటించారు..