దుబాయ్‌, సామాజిక స్పందన :

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ టోర్నీల్లో తప్ప దైపాక్షిక సిరీస్‌ల్లో ఎదురుపడని.. భారత్‌, పాకిస్థాన్‌ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగనుండగా. యావత్‌ ప్రపంచం ఈ మ్యాచ్‌ కోసం కండ్లప్పగించి చూస్తున్నది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు చివరిసారి తలపడగా.. అప్పుడు భారత్‌పై పాక్‌ గెలిచింది. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా తహతహలాడుతుంటే.. బాబర్‌ ఆజమ్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంది! మరింకెందుకు ఆలస్యం మీరు కూడా టీవీలు ట్యూన్‌ చేసేయండి!!

 క్రీడా జగత్తులోనే అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న భారత్‌, పాక్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్‌ వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ గ్రూప్‌-‘ఎ’నుంచి బరిలోకి దిగుతున్నాయి.