సామాజిక స్పందన: కాకినాడ
జైభీమ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లిఖార్జున అధ్యక్షతన ఈరోజు జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయడం, మహిళా కమిటీలను ఏర్పాటు చేయడం, నియోజకవర్గ కన్వీనర్లను ఏర్పాటు చేయడం కోసం మరియు జిల్లా వ్యాప్తంగా జైభీమ్ భారత్ పార్టీని మరింతగా విస్తృతం చేయడం కోసం ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ, పార్టీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు.
సామాజిక స్పందన: హైదరాబాద్, ఉప్పల్
తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్ చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు.విశాఖలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని నక్సల్స్లో చేర్చారని శిల్పపై అభియోగాలు దాఖలయ్యాయి. విశాఖలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసు దర్యాప్తును తాజాగా ఎన్ఐఏకి అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్ కేసుకు సంబంధించి అధికారులు శిల్పను ప్రశ్నించనున్నారు.
మూడు సంవత్సరాల క్రితం తమ కూతురుని కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు..
రాధ కేసుతో శిల్పకు సంబంధం లేదు..
న్యాయవాది శిల్పను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆమె భర్త బండి కిరణ్ స్పందించారు. ''సోదాల విషయంలో ఎన్ఐఏ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారని శిల్ప చైతన్య మహిళా సంఘం నుంచి బయటకు వచ్చింది. శిల్పను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. గతంలో అర్బన్ మావోయిస్టు అని శిల్పను 6 నెలలు జైల్లో ఉంచారు. రాధ మిస్సింగ్ కేసుతో శిల్పకు ఎలాంటి సంబంధం లేదు'' అని పేర్కొన్నారు.
@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
ఏపీ సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది....
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా ఏపీ ప్రభుత్వం ఎత్తివేస్తూ వస్తోంది. అయితే.. అలా ఇష్టానుసారం కేసులు ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా.. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది హైకోర్టు. అంతేకాదు, కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ హెచ్చరికలు జారీ చేసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా, ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.
@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
సామాజిక స్పందన: ముంబై:
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు.
భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ఈ మేరకు ముంబై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ కంప్లయింట్ చేశాడు. ఉద్దవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..
బుధవారం నాటి రాజకీయపరిణామాల అనంతరం రాత్రి.. ఆయన సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్ ప్రోటోకాల్స్ను ఉద్దవ్ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్సింగ్ ఆరోపణ.
ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.











0 Comments