హైదరాబాద్, సామాజిక స్పందన:
వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మందికి సంబంధించిన డేటా చోరీ చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు..
పలు ఆన్లైన్ వెబ్సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని చెప్పారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
''బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం తస్కరించినట్లు గుర్తించాం. ఫేస్బుక్ యూజర్ల ఐడీ, పాస్వర్డ్లు, ఐటీ ఉద్యోగుల డేటాను సైతం చోరీ చేశారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల డేటా అంగట్లో అమ్మకానికి పెట్టారు. మహిళల వ్యక్తిగత డేటానూ సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. ఈ వ్యవహారంలో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ జారీ చేసే ఓ ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించాం. దీనికి సంబంధించి జస్ట్ డయల్ సంస్థపై కూడా కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇలాంటి కేసులు మా దృష్టికి వచ్చాయి. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తాం'' అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు..










0 Comments