అమరావతి, సామాజిక స్పందన

 తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సిదార్ధ లూథ్రా కుమారుని వివాహం ఆదివారం, రిసెప్షన్‌ సోమవారం జరగనుంది..

హోటల్‌ రీజెన్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఈ రిసెప్షన్‌కు హాజరు కానన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. మంగళవారం (28వ తేదీ) వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు..

కాగా స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై ఈ నెల 28న (మంగళవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. స్కిల్‌ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇటీవల రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయగా, ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సీఐడీ సవాల్‌ చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో హైకోర్టు తన పరిధి దాటిందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది..