అమరావతి, సామాజిక స్పందన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌   చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ.. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనుంది..

తెదేపా , జనసేన  అధినేతలు చంద్రబాబు , పవన్‌ కల్యాణ్‌ తోపాటు బాలకృష్ణ ఈ సభకు హాజరుకానున్నారు. తెదేపా - జనసేన పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ రానుండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు భారీ ఎత్తున సభకు తరలివస్తారని అంచనా.

విజయోత్సవ సభ నిర్వహణకు 14 ప్రత్యేక కమిటీలను తెదేపా నియమించింది. కమిటీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్‌, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్‌, ఆలపాటి, బండారు సత్యనారాయణ తదితరులు ఉన్నారు..

ఇప్పటికే యువగళం విజయోత్సవ సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ నెల 20న భోగాపురంలో జరిగే విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యువగళం విజయోత్సవ సభకు రవాణా సౌకర్యం కల్పించాలని అచ్చెన్న ఆర్టీసీ ఎండీని కోరారు. అన్ని డిపోల నుంచి అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు కేటాయించాలని లేఖలో తెలిపారు..