హైదరాబాద్ , సామాజిక స్పందన:-
దేశాన్ని భాజపా(BJP) జలగలాగా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్(CM KCR) ఆరోపించారు. ప్రగతి భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోదీ(PM Modi)పై విరుచుకుపడ్డారు. ''ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టారు. ఆ సమావేశాల్లో గతంలో సాధించిన విజయాలు, చేయబోయే కార్యక్రమాల గురించి సందేశం ఇవ్వాలి. కానీ, ప్రధానమంత్రి ఏం మాట్లాడారో భగవంతునికే ఎరుక. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో యశ్వంత్ సిన్హా వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడిగా. తెరాస అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోదీ, మంత్రులు సమాధానం చెప్పలేదు. వారి డొల్లతనాన్ని బయటపెట్టారు. తెలంగాణ గురించి భాజపా సభలో ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ప్రధాని మోదీ అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు''
''మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని చెప్పారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో ఆయనే చెప్పాలి. గతంలో మోదీ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నాం. భాజపా అసమర్థత వల్లే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోదీ హయాంలో రూపాయి విలువ పతనమైంది. దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలరా? తెలంగాణ తప్ప దేశమంతా చెడ్డ పవర్ పాలసీ తీసుకొచ్చారు. సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవ్వడం కూడా చేతకాదా? దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. ఇదే మీ పాలనకు నిదర్శనం. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం 10శాతమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా?అసమర్థ విధానాల వల్ల దేశాన్ని ఆగం పట్టించారు. రూపాయి పతనం ఆపలేరు, నిరుద్యోగాన్ని కట్టడి చేయలేరు. లొల్లి పెట్టడం ఒక్కటే మీక చేతనైంది''
''భాజపా పాలన అంతా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి, కుంభకోణాలమయం. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. అసెంబ్లీలో ఇదే విషయం చెప్పా. దేశంలో ఏటా కోటి 30లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీళ్ల చేతగాని తనాన్ని ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్ చెబుతున్నా. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్గా ఉంది. కాబట్టే కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్గా ఉన్న ప్రభుత్వం రావాలి. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ జీడీపీ 128.3శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం జీడీపీ 89.6శాతంగా ఉంది''
కట్టప్పా.. కాకరకాయా? ఏం చేస్తారు?
''కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి.. భాజపాయేతర ప్రభుత్వం రావాలి. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుంది. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తాం. అలాంటి ప్రభుత్వం తెలంగాణలో మాకెందుకు? కేంద్ర ప్రభుత్వం వేగం తక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం వేగం ఎక్కువ. కేంద్రంలో తప్పకుండా భాజపాయేతర డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది. భాజపా నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్నాథ్ శిందే వస్తారా? తెలంగాణలో మూడోవంతు మెజార్టీతో తెరాస గెలిచింది. ఇదేనా మీ పాలసీ. నుపుర్ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారు. భాజపా అసమర్థ విధానాల వల్ల భారత్ పరువుపోతోంది. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయిస్తారా?భాజపా నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. కట్టప్పలా.. కాకరకాయా? కట్టప్పలు, ఏక్నాథ్ శిందే.. ఇలాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? ఏక్నాథ్ శిందే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్ ఛార్జీలు పెంచారు. మీ వల్ల ఏమవుతుంది. మన్నూ మశానం తప్ప''
దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి
''ప్రముఖ విలేకరులను నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఏక్నాథ్ శిందేలను సృష్టిస్తామని బాహాటంగా చెబుతున్నారు. మీ ఉన్మాదం.. పిచ్చి ఎక్కడిదాకా పోతుంది? తెలంగాణ రైతులను అవమానించేలా కేంద్ర మంత్రి గోయల్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నూకలు ఎక్కువగా వస్తాయంటే.. అవే తినాలన్నారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి... అంతకంటే గొప్ప?పంటలకు సంబంధించి కేంద్రానికి ఏమైనా విధానం ఉందా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బీమా అమల్లో ఉందా? వాణిజ్య, వ్యవసాయశాఖకు సమన్వయం లేదని భారతీయ కిసాన్సంఘ్ చెప్పింది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యయికపరిస్థితి నడుస్తోంది. సర్కారు నడుపుతున్నారా? గూండాయిజం చలాయిస్తున్నారా? మోదీకి తెలియకుండా బ్యాంకు లూటీలు జరగట్లేదు. బ్యాంకులను దోపిడీ చేసిన వారిని వెనక్కి రప్పించలేకపోతున్నారు. ఇప్పటివరకూ వరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా? మోదీ గారూ.. బ్యాంకు దొంగల్ని మీ ఈడీలు, సీబీఐలు పట్టుకోవా? బ్యాంకు దొంగలను పట్టుకోవట్లేదంటే మీరు కూడా భాగస్వామ్యమే. అన్ని వివరాలను ప్రజలముందు ఉంచుతాం'' అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పనైపోయిందనే వాళ్లకు ఇదే నా సమాధానం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సామాజిక స్పందన:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం గాంధీభవన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు.
రేవంత్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు. వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారినే పల్లకిలో భూజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కాంగ్రెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎవరూ కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు.
అప్పుడు సిద్దిపేట.. ఇప్పుడు హుజూరాబాద్
''హుజూరాబాద్లో పార్టీ ఓటమితో కుంగిపోయిన నన్ను.. పార్టీకి 45 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించడం ద్వారా కార్యకర్తలు అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ల గుండెల్లో ఉందని నిరూపించారు. డిసెంబరు 9న సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే... 95 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఆక్రమించింది. దేశం మొత్తం తెలంగాణ నమూనా సభ్యత్వాలు చేయండని పార్టీ అగ్రనేతలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక చరిత్ర గుర్తు చేయదల్చుకున్నా. హుజూరాబాద్లో 3,500 ఓట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పనైపోయిందని విమర్శించే వాళ్లకు ఒకటే చెబుతున్నా.2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నిక వచ్చింది. అప్పుడు 90మంది ఎమ్మెల్యేలతో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతిపక్షనేత, సీఎల్పీ నాయకుడిగా ఉండి ఉపఎన్నికను ఎదుర్కొన్నారు. సిద్దిపేట ఉపఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే.. వైఎస్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్రెడ్డికి 3,700 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు మొదటి సారి వచ్చినవి కావు. గొప్ప నాయకుడు రాజశేఖర్రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో అదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా రాజశేఖర్రెడ్డి నాయకత్వం ఖతమై పోయింది. కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిపోయిందన్నారు. కానీ, 2004లో రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేసి.. మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతి ఓటమి ఒక గెలుపునకు పునాది అవుతుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాకు ఒక అనుభవం'' అని రేవంత్ పేర్కొన్నారు..
ఆగస్టులో రాహుల్ పర్యటన: మధుయాష్కీ
రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభ ఆగస్టులో ఉంటుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. రెండు నెలలకోసారి రాహుల్ గాంధీ వస్తారని.. ప్రియాంక గాంధీ కూడా రానున్నారని వెల్లడించారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరముందని చెప్పారు. పీసీసీ కార్యవర్గం ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మధుయాష్కీ.. ఏఐసీసీ శాశ్వత సభ్యులుగా నియమితులైన సుబ్బిరామిరెడ్డిని సత్కరించారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సుబ్బిరామిరెడ్డి అనుభవం ఉపయోగపడుతుందన్నారు. సర్వేల్లో కాంగ్రెస్కు 70 స్థానాలు తక్కువ కాకుండా అధికారంలోకి వస్తుందని చెబుతున్నారని పేర్కొన్నారు. పీకే సర్వేల్లో తెరాసకు 25 సీట్లు వస్తున్నాయని తెలిపారు.
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
కేసిఆర్ కొత్త భూస్వాములను తయారు చేస్తున్నారు అంటున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సామాజిక స్పందన
సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు.పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్రోడ్డు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భూ బాధితులు తమ సమస్యలను నేతల ముందు ఏకరవు పెట్టారు. పేదల ఆత్మగౌరవంపై కేసీఆర్ సర్కారు దాడి చేస్తుందన్నారు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన వారికి సంకెళ్లు వేసి నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ను రద్దు చేయడమే మార్గమన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల జోలికి రావొద్దని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అసెంబ్లీలో, బయట ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. భూముల విలువ పెంపకం పేరుతో రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయన్నారు.
.jpg)











0 Comments