నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం, దేశంలో పేదలు కలలు కనొచ్చు, ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని అంటున్న నూతన రాష్ట్రపతి

 


దిల్లీ, సామాజిక స్పందన:

దేశ అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ ఆసీనులయ్యారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. సంప్రదాయ సంతాలీ చీరలో ఆమె ప్రథమ పౌరురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు/ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు, ముర్ము రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అంగరక్షక సేన ఆమెకు గౌరవవందనం సమర్పించింది. అక్కడి నుంచి సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము పార్లమెంట్ సెంట్రల్‌ హాలుకు చేరుకున్నారు. ఆమె వెంట రామ్‌నాథ్‌ కోవింద్ కూడా ఉన్నారు. పార్లమెంట్‌కు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్‌ ఎన్.వి. రమణ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సెంట్రల్‌ హాలులో సీజేఐ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగించారు. ఈ ప్రసంగం లో ఆమె ఇలా అన్నారు...

దేశంలో పేదలు కలలు కనొచ్చు, ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని, అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం(ఇవాళ) ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేశారు. అనంతరం ఆమె ప్రసంగించారు.

అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ శుభాకాంక్షలు.

నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా అని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ సాక్షిగా ఆమె ప్రసంగించారు.


Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.