అమరావతి, సామాజిక స్పందన:
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0 నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లా పెదరావూరు నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది.రాజధాని రైతులతోపాటు స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత పెదరావూరులో రైతులు బసచేసిన ప్రాంతం వద్ద పూజలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం పాదయాత్ర మొదలు కాగా.. దారి పొడవునా ఎక్కడికక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై మళ్లీ అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు.
@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి:సీఈవో ముఖేష్ కుమార్
అమరావతి, సామాజిక స్పందన
గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మరోసారి ఆదేశాలిచ్చారు.ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రక్రియలోనూ వాలంటీర్లకు విధులు అప్పగించవద్దని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న కారణంగా ఎన్నికల విధుల్లో వారికి అవకాశం ఇవ్వొద్దని ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు.











0 Comments